ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టీ నటిం చగా, మహి. వి. రాఘవ దర్శకత్వం వహించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వైఎస్. రాజశేఖరెడ్డి తనయుడు, ఏపీ సీయం వైఎస్. జగన్మోహన్రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర, పాదయాత్రలు ప్రధానాంశాలుగా ‘యాత్ర 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘యాత్ర’ సినిమాకు దర్శకత్వం వహించిన మహి. వి. రాఘవనే ‘యాత్ర 2’కు దర్శకత్వం వహించారు. మరి..‘యాత్ర 2’ కూడా ‘యాత్ర’లా విజయం సాధించిందా? రివ్యూలో చదవండి.
సినిమా: యాత్ర 2
ప్రధాన తారాగణం: జీవా, మమ్ముట్టీ, శుభలేకసుధాకర్, సచిన్ ఖేడ్కర్, సుజానే బెర్నెర్ట్
దర్శకుడు: మహి. వి. రాఘవ
నిర్మాతలు: త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్, శివమేక
సంగీతం: సంతోష్నారాయణన్
విడుదల: ఫిబ్రవరి 8
కథ
జాతీయ స్థాయి ప్రోగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి (మమ్ముట్టీ) హఠాన్మరణంతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపుతీసుకుంటాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(సినిమాలో జీవా) ఆంధ్రప్రదేశ్కు సీయం కావాలని అధికారంలో ఉన్న ప్రొగ్రెస్ పార్టీ ఎక్కువ మంది ఎమ్.ఎల్.ఏలు ప్రతిపాధిస్తారు. ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న ప్రొగ్రెస్ పార్టీ నాయకురాలికి మరోలా చెబుతారు కొందరు నేతలు. దీంతో ప్రొగ్రెస్ పార్టీ నాయకురాలు ఏపీ సీయంగా మరోకరిని నియమిస్తుంది. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాడర్ కాస్త నిరుత్సాహపడుతుంది. కానీ ఇదే సమయంలో తండ్రి వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన, ఆయన అభిమానులను పరామ ర్మించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రను మొదలుపెడతారు. కానీ ఈ ఓదార్పు యాత్రను రాజకీయకోణంలో అర్థం చేసుకున్న ప్రోగ్రెస్పార్టీ నాయకురాలు, ఈ ఓదార్పు యాత్రను ఆపేయాల్సిందిగా ఆదేశిస్తారు. దీంతో కలత చెందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆమె తల్లి ప్రొగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీ నామా చేస్తారు. కానీ ఉప ఎన్నికల్లో అత్యధిక భారీ మెజార్టీతో గెలుస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో విజయం సాధించాలనుకున్నాడు వైఎస్. జగన్మోహన్రెడ్డి, కానీ ప్రత్యర్థి పార్టీ తెలుగునాడు నాయకుడు చంద్రబాబు(మహేశ్ మంజ్రేకర్) సీయం అవుతాడు. మరి..ప్రతిపక్షనాయకుడిగా జగన్మోహన్రెడ్డిని ఏ విధంగా రాణించారు? చంద్రబాబు, ప్రొగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్. జగన్మోహన్రెడ్డిపై ఏ విధమైన రాజకీయ బెదిరింపులకు పాల్పడ్డారు? 2019 ఎలక్షన్స్లో అధికారంలోకి రావడానికి జగన్ మోహన్రెడ్డి ఏ విధంగా కష్టపడ్డారు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ప్రత్యర్థులు ఏ విధమైన పన్నాగాలు పన్నారు? అనే అంశాలను సినిమాలో
చూడాలి.
విశ్లేషణ
పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని కుదించి, సినిమాటిక్ ట్రాక్లోకి తెచ్చి, రెండున్నర గంటల నిడివితో ఆడియన్స్ను కనెక్ట్ చేయాలంటే ఏ దర్శకుడికైనా కత్తిమీద సాము. కానీ దర్శకుడు మహి. వి. రాఘవకు ‘యాత్ర’ తీసిన అనుభవం, ఆ చిత్రం సాధించిన విజయం ‘యాత్ర 2’ కోసం మహి. వి. రాఘవను ముందుకు పంపినట్లు ఉంది. ‘యాత్ర 2’ చిత్రం మొత్తం 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు మహి. వి. రాఘవ ముందే చెప్పారు. ఇలా ఆడియన్స్ను ప్రిపేర్ చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం, రచ్చబండ కార్యక్రమానికి వెళ్లడం, మరణం..ఒకట్రెండుఎలివేషన్స్తో సినిమా మొదలవుతుంది. ఎప్పుడైతే ఓదార్పు యాత్రకు జగన్ బయలుదేరడం, ప్రొగ్రెస్ హై కమాండ్ వద్దనడం, ఉపఎన్నికల్లో గెలవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు ఓదార్పు యాత్ర చేయాలనుకున్నాడు? వైఎస్ఆర్తో ఉన్న ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్లో మెప్పిస్తాయి. ఫస్టాప్లో ఉన్నంత ఎమోషనల్ కనెక్ట్విటీ సెకండాఫ్లో ఉండదు. పొలిటికల్ డ్రామా కనిపిస్తుంది. ఇది కూడా కం ప్లీట్గా వన్సైడ్ అని కాకుండ ఉండటం సినిమాకు లాభిస్తుంది. సెకండాఫ్లో కూడ కొన్ని ఎమోషనల్ సీన్స్పడి ఉంటే బాగుండేది. జగన్ ఓదార్పు యాత్రలో ఎమోషనల్ సీన్స్ను ప్లాన్ చేసిన దర్శకుడు, పాదయాత్రలో ఎఫెక్టివ్ ఎమోషనల్ సీన్స్ను పెట్టడంలో కాస్త విఫలమైయ్యారు. ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సన్నివేశాలు కూడా పాత్రధారులు రిపీట్ కావడం కాస్త మైనస్. ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడం, ప్రొగ్రెస్పార్టీతరఫున 18మంది ఎమ్ఎల్ఏలు గెలవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపన అన్నీ చకా చకా స్క్రీన్పైకి వచ్చి వెళ్తుంటాయి. అలా కాకుండ కాస్త వివరణ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ ఘటనల పట్ల అవగాహన లేని ఈ తరం ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. జగన్ మార్క్ రాజకీయం ఉండే సన్నివేశాలు లేవు. కానీ జగన్ పాత్రను సందర్భానుసారంగా ఎలివేట్ చేయడం, శుభలేక సుధాకర్ పాత్రతో మరింత ఎఫెక్టివ్గా ఆడియన్స్కు చెప్పడం ప్రేక్షకులకు భలే అనిపిస్తుంది. కాస్త రియల్ ఫుటేజీని కూడా వాడారు మేకర్స్. ఇవి వైఎస్ఆర్పార్టీ అభిమానులకు కిక్ ఇస్తాయి. అన్ని చోట్ల కాకపోయిన కొన్ని చోట్ల కథమొత్తం ఓ వైపు బ్లెండ్ అయినట్లుగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఆడియన్స్ను మెప్పిస్తుంది ‘యాత్ర 2’.
పెర్ఫార్మెన్స్
వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్రలో జీవా జీవించాడు. ముఖ్యంగా తొలిభాగంలో వచ్చే ఎమోషనల్ సీన్స్లో నెక్ట్స్ లెవల్ యాక్టింగ్ చేశాడు. దీనికి తోడు కాస్త ఎఫెక్టివ్ డైలాగ్ డైలివరీ, కరెక్ట్ అయిన బాడీ లాంగ్వేజ్ ఉండే ఇంకా బాగుండేది. ఇక వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి సూపర్భ్గా చేశారు. ఓ రకంగా తొలిభాగంలో ఆయన పాత్రే గుర్తుంటుంది ఉన్నది కొంచెం సేపు అయిన. ప్రొగ్రెస్పార్టీకి చెందిన ఓ రాజకీయనాయకుడిగా శుభలేకసుధాకర్కు ఓ మంచి రోల్ పడింది. ఆయన చెప్పే డైలాగ్స్ ఆడియన్స్కు, ముఖ్యంగా వైఎస్, జగన్ఫ్యాన్స్కు ఊపునిస్తాయి. చంద్రబాబు పాత్రలో మహేశ్ మంజ్రేకర్ కనిపించారు. పాత్రపరిధి మేరకు నటించారు. వైఎస్ భారతీగా కేతకీ నారాయణ్, ప్రొగ్రెస్పార్టీ నాయకురాలుగా సుజానే బెర్నెర్ట్, ప్రొగ్రెస్పార్టీ జాతీయ నాయకుడిగా సచిన్ ఖేడ్కర్లు పాత్రల పరిధిమేరకు నటించారు.
దర్శకుడు మహి. వి. రాఘవను ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. యాక్షన్ యాంగిల్లేకపోయిన, కేవలం డైలాగ్స్తో మంచి ఎలివేషన్ చేశాడు. ‘దేవుడు నమ్మ కం..వైఎస్ఆర్ నిజం’, ‘నాయకులకు తెలిసినంత రాజకీయం’ కార్యకర్తలకు తెలియదు కదా.. సార్’ వంటి డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమా రన్ టైమ్ తక్కువగా ఉంది. దీంతో స్క్రీన్ ప్లే స్పీడ్గా కదులుతుంది. ఆడియన్ బోర్గా ఫీల్ కాడు. సంతోష్నారాయణ్ మ్యూజిక్, ఆర్ఆర్ బాగున్నాయి. సాంగ్స్, లిరిక్స్ అర్థవంతంగా సీన్స్కు తగ్గట్లు అనిపిస్తాయి. వి సెల్యూలాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్, శివమేకల నిర్మాణ విలువలు కనిపిస్తాయి. శర్వాన్ ఎడిటింగ్ బాగుంది.
బలాలు
జీవా, మమ్ముట్టీల యాక్షన్
కాస్త ఎమోషనల్ కనెక్ట్
బలహీనతలు
వన్సైడెడ్గా ఉండే కథనం
లోపించిన పొలిటిక్ డ్రామా
బాటమ్లైన్: యాత్ర 2.. పొలిటికల్ ఎమోషన్ (2.75)