tollywood Sankranti 2024: ఈ సంక్రాంతి వెండితెర వినోదానికి రంగం సిద్ధమైంది. వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’, మహేశ్బాబు ‘గుంటూరుకారం’, తేజా సజ్జా ‘హను-మాన్’ సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
మహేశ్బాబు గుంటూరుకారం
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘గుంటూరుకారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరో యిన్స్గా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్, జగపతిబాబు, జయరాం, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. సూర్య దేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాకు తమన్ స్వరకర్త.
ఓ పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి చిన్నతనంలోనే బయటకు వచ్చి, ఓ మాస్ యాటిట్యూడ్తో జీవిస్తుంటాడు రమణ. పాతిక సంవత్సరాల తర్వాత తిరిగి సొంత కుటుంబానికి హెల్ప్ చేయాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంకట రమణ ఏం చేస్తాడు? తల్లి తన పెద్ద కొడుకును ఏ విధంగా అంగీకరిస్తుంది? అసలు..వీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అన్నదే ‘గుంటూరు కారం’ చిత్ర కథాంశం అట. ఈ సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు. తొలిభాగం 1గంట 24 నిమిషాలు ఉండగ, మలిభాగం 1గంట 14 నిమిషాలు ఉంటుంది. సెన్సార్ ఈ సినిమాను యూ బై ఏగా సర్టిఫై చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 130 కోట్ల రూపాయలుగా అని సమాచారం.
హను–మాన్
తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘హను–మాన్’. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. వర లక్ష్మీ శరత్కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. నిరంజన్రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జనవరి 12న ఈ సినిమాను విడుదల కానుంది. అయితే జనవరి 11 సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు టీమ్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 30 కోట్లు అని తేలిసింది.
అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రాంతంలో నిగూఢమైన ఓ శక్తి కోసం విలన్ వినయ్రాయ్ అండ్ టీమ్ ట్రై చేస్తుంటుంది. ఈ క్రమంలో అంజనాద్రిలో నివసిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ సమయంలో అతీతమైన శక్తులు పొందిన హీరో తేజా సజ్జా తన వారిని, అంజనాద్రిని ఏ విధంగా కాపాడాడు అనేది ఈ చిత్రం కథ. ఇందులో హనుమంతుని పాత్రలో చిరంజీవి నటించారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి 2గంటల 39 నిమిషాలు.
సైంధవ్
వెంకటేష్ హీరోగా ‘హిట్’ ఫ్రాంచైజీ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధాశ్రీనాథ్, రుహానీశర్మ, ఆండ్రియా, తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.
స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది గాయత్రి(చైల్డ్ ఆర్టిస్టు సారా). గాయత్రి ప్రాణాలు దక్కాలంటే, ఈ చిన్నారికి రూ.17 కోట్ల ఖరీదైన ఓ ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖరీదైన ఇంజెక్షన్ కోసం సైంధవ్ (వెంకటేష్) ఏం చేశాడు? అతని గతం గాయత్రి ప్రాణాలు కాపాడబడటానికి ఏ విధంగా సహాయపడింది? అసలు..ఇంద్రప్రస్థ సిటీ లో జరిగిన సంఘటనలకు సైంధవ్కు సంబంధం ఏమిటి? అనే అంశాల సమాహారమే ఈ చిత్రం కథ. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ఈ సినిమా ప్రధానాంశం. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ‘హిట్’, ‘హిట్ 2’ వంటి హిట్ చిత్రాలను తీసిన శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా రూపొందింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డ్ యూ బై ఏగా సర్టిఫై చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు అని సమాచారం.
నా సామిరంగ
నాగార్జున హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నా సామిరంగ’. ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ నటించగా, అల్లరి నరేశ్కు జోడీగా మిర్నామీనన్, రాజ్తరుణ్కు జోడీగా రుక్సార్ థిల్లాన్ నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ సినిమాతో. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా నిడివి రెండు గంటల 30 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మలయాళ హిట్ పొరింజు మరియమ్ జోస్కు తెలుగు రీమేక్గానా సామిరంగ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు 25 కోట్లు బ్రేక్ ఈవెన్ అని తెలిసింది.
కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేశ్) మంచి స్నేహితులు. వీరితోనే ఉంటుంటాడు భాస్కర్ (రాజ్తరుణ్). ఈ ముగ్గుర్ని కలిపే ఓ కామన్ ఉంటుంది. అది సినిమాలో చూడాలి. ముఖ్యంగా, స్నేహాం, లవ్ అంశాలతో ఈ చిత్రం ఉంటుంది.
అనుకున్నారు..కానీ విడుదల కాలేదు.
పవన్కళ్యాణ్ ఉస్తాద్ భగత్సింగ్, ప్రభాస్ ‘కల్కి2898 ఏడీ’, రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్, రజనీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాలు కూడా 2024 సంక్రాంతి విడు దలకు పోటీ పడగా, థియేటర్స్కు రాలేకపోతున్నాయి.
డబ్బింగ్ లేదు
కొన్నేళ్లుగా తెలుగు సంక్రాంతికి ఓ డబ్బింగ్ చిత్రం రిలీజ్ ఉండేది కానీ ఈ ఏడాది లేదు. తమిళంలో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తీకేయన్ ‘అయాలాన్’, అరుణ్ విజయ్ ‘మాఫియా: చాఫ్టర్ 1’ విజయ్ సేతుపతి–కత్రినా కైఫ్ ‘మేరీ క్రిస్మస్’ చిత్రాలు కోలీవుడ్లో పొంగల్కు విడుదల అవుతున్నాయి.