ప్రతి ఏడాది తెలుగుతెరపై సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఈ ఏడాది ఈ సీక్వెల్స్ హడావిడి డబుల్ అయ్యింది. పదికిపైగా సీక్వెల్ సినిమాలు తెలుగు తెరపైకి వస్తున్నాయి. ఆడియన్స్ను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఈ సీక్వెల్స్ ఏంటో మీరూ ఓ లుక్ వేయండి.
సలార్: శౌర్యాంగపర్వం (Salaar Part 2 Shauryanga Parvam)
హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. ఈ సినిమా లోని తొలిపార్టు ‘సలార్:సీజ్ఫైర్’ 2023 డిసెంబరులో విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. దాదాపు 700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. దీంతో వెంటనే ‘సలార్’ రెండోపార్టు ‘సలార్: శౌర్యంగా పర్వం’ను స్టార్ట్ చేశారు ప్రభాస్, ప్రశాంత్నీల్. హోంబలే ఫిలింస్ పతాంకపై విజయ్కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 డిసెంబరులో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్సుకుమారన్, జగపతిబాబు, బాబీసింహా, శ్రేయారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, శ్రుతీహాసన్ హీరోయిన్గా చేస్తున్నారు.
పుష్ప: ది రూల్ (AlluArjun PushpaTheRule)
‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి లవ్ఫిల్మ్స్ తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఓ డిఫరెంట్ ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2022 డిసెంబరులో విడుదలై, సూపర్హిట్కొట్టింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ తీస్తున్నారు సుకుమార్, అల్లు అర్జున్. మైత్రీమూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్లు నిర్మిస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ఫాజిల్, జగపతిబాబు, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జై హనుమాన్ (Jai Hanuman)
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన మైథలాజికల్ సూపర్హీరో అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హను–మాన్’(2004). ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనీవర్స్లో భాగంగా, కె. నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సూపర్డూపర్ బ్లాక్బస్టర్గా నిలిచింది. పాతికకోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల రూపాలయకు పైగా కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్గా ‘జైహను–మాన్’ను ప్రకటిం చారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా ఎక్కువ బడ్జెట్తో, పెద్ద క్యాస్టింగ్తో ఉండబోతుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలైయ్యాయి. 2025లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
డబుల్ఇస్మార్ట్ (DoubleIsmart)
ఎనర్జీటిక్ హీరో రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన సైంటిఫిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాకు సీక్వెల్గా ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తీస్తున్నారు రామ్, పూరీ. ఈ ఏడాదే ఈచిత్రం విడుదల కానుంది. చార్మీ, పూరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
గూఢచారి 2 (Goodachari 2)
అడవిశేష్ కెరీర్ను యాక్టింగ్ పరంగా, మార్కెట్ పరంగా నెక్ట్స్ లెవల్కి తీసుకుని వెళ్లిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. ‘గూఢచారి 2’ బ్లాక్బస్టర్గా నిలవడంతో ప్రస్తుతం ‘గూఢచారి 2’ తీస్తున్నారు అడవిశేష్. అయితే దర్శకుడు మారాడు. వినయ్కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ‘గూఢచారి 2’ చిత్రం 2024లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
డీజేటిల్లు (DJ Tillu Square)
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కెరీర్ గ్రాప్ అమాంతం పెరిగిపోయింది ‘డీజే టిల్లు’ సినిమాతో. విమల్ కృష్ణ డైరెక్టర్. 2022 ఫిబ్రవరిలో విడుదలైన ‘డీజేటిల్లు’ సూపర్హిట్ కావడంతో, వెంటనే ఈ సినిమాకు సీక్వెల్గా ‘డీజేటిల్లు స్క్వేర్ తీస్తున్నారు సిద్దు జొన్నలగడ్డ. అయితే ఈ సినిమా సీక్వెల్లో హీరోయిన్తో పాటు, దర్శ
కుడు కూడా మారాడు. తొలిభాగంలో నేహాశెట్టి హీరోయిన్గా నటించగా, మలిభాగంలో అనుపమాపరమే శ్వరన్ హీరోయిన్. తొలిపార్టుకు విమల్కృష్ణ దర్శకుడు కాగా, సీక్వెల్కు మల్లిక్రామ్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో విడు దల కానుంది.
ఢీ2 డబుల్డోస్ (Dhee: Double Dose)
మంచు విష్ణు కెరీర్లోని ఓ మాంచి బ్లాక్బస్టర్ ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థియే టర్స్లో కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాగా ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఢీ: డబుల్ డోస్’ను ప్రకటించారు మంచు విష్ణు, శ్రీనువైట్ల. కానీ ఈ సినిమా ఆడిపోయిందనే టాక్ వినిపి స్తోంది.
చిత్రం 1.1 (Chitram1.1 )
దర్శకుడు తేజ ఇండస్ట్రీకి చాలామంది కొత్తవారిని పరిచయం చేశాడు. వీటిలో ‘చిత్రం’ సినిమా ఒకటి. 2000లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఉదయ్కిరణ్ హీరోగా పరిచయమైంది ఈ సినిమా తోనే. అయితే 2021లో ఈ సినిమాకు సీక్వెల్గా ‘చిత్రం 1.1’ను ప్రకటించారు తేజ. 40మంది కొత్తవారిని పరిచయం చేయాలనుకున్నారు. ‘చిత్రం’ సినిమాకు ఉన్న టెక్నికల్ టీమ్ అంతా ఈ సినిమాకు కుదిరారు. కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు.
భాగమతి 2 (Anushka Bhaagamathie 2)
అనుష్కా శెట్టి కెరీర్లోని లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్లో చెప్పుకోదగ్గ హిట్ ఫిల్మ్ ‘భాగమతి’. ఈ సినిమాకు అశోక్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్ను ప్రకటిం చారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే తొలిపార్టుకు దర్శకత్వం వహించిన అశోక్యే, మలి పార్టుకు దర్శకత్వం వహిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది (Anjali Geethanjali Malli Vachindi)
అంజలి నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గీతాంజలి’. హారర్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సిని మాకు సీక్వెల్గా ఇప్పుడు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ తెరకెక్కుతోంది. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యానారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తొలిపార్టుకు రాజ్కిరణ్ దర్శకుడు కాగా, మలి పార్టుతో శివతుర్లపాటి దర్శకుడిగా పరిచయం కానున్నారు.
భామకలాపం (Prriyamani Bhamaakalaapam)
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భామకలాపం’. డైరెక్ట్గా ఓటీటీలో విడుదలైంది సినిమా. వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్గా ‘భామాకలాపం’ తీస్తున్నారు. సీక్వెల్ మాత్రం థియేటర్స్లో విడుదల కానుంది. అభిమన్యు డైరెక్టర్.
బుజ్జి ఇలా రా! (DhanRaj Bujji ela Ra)
సునీల్, ధన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా ‘బుజ్జి ఇలా రా 2’ తెరకెక్కుతోంది. గరుడవేగ అంజి ఈ సినిమాతో దర్శకుడు.
మరికొన్ని
ఈ సినిమాలే కాదు…బింబిసార, డెవిల్ సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయని కళ్యాణ్రామ్, ‘అఖండ’కు సీక్వెల్గా ‘అఖండ 2’, రమేష్వర్మ ‘రాక్షసుడు 2’లను ప్రక టించారు. శతమానం భవతి సీక్వెల్ ప్రకటన వచ్చేసింది. అయితే మత్తువదలారా 2, మ్యాడ్ 2 చిత్రాల స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని తెలిసింది. ఓ దశలో రవితేజ ‘విక్రమార్కుడు 2’ కథను రెడీ చేస్తున్నట్టుగా విజయేంద్రప్రసాద్ చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్ 2’కు కూడా స్కోప్ ఉందని అన్నారు ఈ దర్శక–రచయిత ఓ సందర్భంలో. ఇంకా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ 2’, ‘మసూధ 2’, రవితేజ ‘క్రాక్ 2’, ‘పెద కాపు 2’…ఇలాంటి ప్రకటనలు మరికొన్ని ఉన్నాయన్న సంగతి తెలిసిందే.