Dhanush DNS: ధనుష్ తెలుగులో చేసిన తొలి మూవీ ‘సార్’. తమిళంలో ‘వాతి’. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరిలో విడుదలై, ఘనవిజయం సాధించింది. వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను కొల్లగొట్టింది. ‘సార్’ సినిమా విడుదల కాకముందే, ధనుష్ తెలుగులో మరో మూవీ చేయనున్నారనే టాక్ వినిపించింది. ఈ వార్తలు నిజమన్నట్లుగా 2022 నవంబరులో ధనుష్ తెలుగులో తర్వాతి సినిమాను ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకుడు. గతంలో శేఖర్ కమ్ములతో ‘లవ్స్టోరీ’ సినిమాను నిర్మించిన సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ ఈ సినిమాకు నిర్మాతలు.
హైదరాబాద్లో ఆరంభం
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో జరిగాయి. ధనుష్, శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ పాల్గొన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ను కూడా స్టార్ట్ చేశారు ధనుష్. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతుంది. మలి షెడ్యూల్ ముంబై, ఆ తర్వాత కొచ్చి లొకేషన్స్లో షూటింగ్ను ప్లాన్ చేశారట మేకర్స్. సామాజిక అసమానతల నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ సినిమా షూటింగ్ అయినా త్వరగా పూర్తి చేయడం ధనుష్ స్టైల్.
ఈ గ్యాప్లో ఏం చేసినట్లు…?
శేఖర్కమ్ములతో సినిమాను ప్రకటించిన తర్వాత స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను కంప్లీట్ చేశాడు ధనుష్. అతని కెరీర్లో ఇది 50వ సినిమా. ఇందులో ధనుష్యే హీరో. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్యాక్షన్ డ్రామా ఇది. అలాగే కొత్త నటీనటులతో ధనుష్ దర్శకత్వంలో మరో సినిమా మొదలైంది. ధనుష్ కెరీర్లో ఇది మూడో డైరెక్షనల్ ఫిల్మ్.
నాగార్జునతో ఈ సారి అయిన సెట్ అయ్యేనా?
‘పా.పాండి’ దర్శకుడిగా ధనుష్కు తొలి చిత్రం. ఈ చిత్రం తర్వాత ధనుష్, అదితీరావ్హైదరీ, నాగార్జున, నిత్యామీనన్ కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. ధనుష్ దర్శకుడు. కట్ చేస్తే..ఈ సినిమా ఆగిపో యింది. కానీ ఇప్పుడు ధనుష్– నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ దర్శకుడు శేఖర్కమ్ముల.